భాషలు మాట్లాడుచున్నామని చెప్పే అబద్ధ బోధకులు

భాషలు మాట్లాడుచున్నామని చెప్పే అబద్ధ బోధకులు
(False Preachers – Speaking in Languages)

పరిశుద్దాత్మ వరములను గురించి-
ప్రియ చదువరి! ఈనాడు అనేక  మంది వ్యక్తులు కీర్తనలు పాడుచున్నప్పుడు వాయిద్యాలు వాయిస్తూ  చాలా ఎక్కువ స్థాయిలోనికి ధ్వనిని తీసుకునివెళ్ళి అప్పుడు కొన్ని అర్ధంలేని పదాలను పలుకుతూ, పరిశుద్ధాత్మ తమ పైకి వచ్చినదని భాషలు మాట్లాడుచున్నామని చెప్పుచున్నారు. వీరు చెప్పుచున్న విషయము బైబిల్ కు సంబంధించినది, కావున వీరు చెప్పేది నిజమా? అబద్దమా? అనేది తెలుసుకొనుటకు లేఖనానుసారంగా పరిశీలించుదాము.
పాతనిబంధన  గ్రంథములో ఎవరు కూడ అన్య భాషలతో మట్లాడినట్లుగా ధాఖలు చేయబడలేదు. క్రొత్త నిబంధన గ్రంథములో క్రీస్తు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన తరువాత వచ్చిన మొదటి పెంతెకోస్తు అను పండుగనాడు మొదటిసారిగా అపోస్తలులు అన్యభాషల(ఇతర భాషలు)తో మాట్లాడినట్లుగా ధాఖలు చేయబడినది(అపో.కా 2:1-4); ఈ వచనాలను గమనించి నట్లయితే వారందరు పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించినట్లుగా మనం చూడగలము. అంతే గాని వారు తమ సొంత శక్తి చేత భాషలతో మాట్లాడినట్లుగా లేదు. యేసు క్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధాత్మను తన శిష్యులైన అపోస్తలులకు పంపుదునని వాగ్ధానము చేసెను(యోహాను 14:16,26; 15:26). ఆయన చనిపోయి తిరిగి లేచిన తరువాత ''కొద్ది దినముల లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందుదురని'' తన శిష్యులతో చెప్పెను(అపో.కా1:5). ''పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు'” అనెను(అపో.కా 1:8). కనుకనే వారు పరిశుద్ధాత్మతో నిండినప్పుడు ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించినట్లుగా చూడగలము. భాషలతో మాట్లాడిన వారందరు గలలియులే, పేతురు ఆ పదునొకరితో కూడా లేచి నిలచి బిగ్గరగా వారితో మాట్లడెను అని లేఖనము తెలియజేస్తుంది(అపో.కా 2:14) అనగా భాషలతో  మాట్లాడిన వారు పన్నెండు మంది అపొస్తలులు మాత్రమే అని లేఖనాలు దృఢపరుస్తున్నవి. ఇక్కడ అపొస్తలులు అర్ధము కాని మాటలు పలుక లేదు, వారు మాట్లాడిన మాటలు అక్కడ చేరిన 15 ప్రాంతాలకు చెందిన ప్రజల యొక్క స్వభాషలో వారికి అర్ధము అయినది. కాబట్టి వారు ఈ విధము గా చెప్పుకొనిరి “....వీరు  (అపోస్తలులు)మన భాషలతో  దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి”.(అపొ.కా 2:11) అపోస్తలులు మాట్లాడిన మాటలు ఎవరి భాషలోవారికి అర్ధము అయినవి, కనుకనే వారు విభ్రాంతి నొందిరి. ఉదా:- అక్కడ ఒక తెలుగు భాష మాట్లాడే వ్యక్తి, ఒక మరాఠీ భాష మాట్లాడే వ్యక్తి, ఒక కన్నడ భాష మాట్లాడే వ్యక్తి, ఒక హిందీ భాష మాట్లాడే వ్యక్తి మరియు ఒక ఇంగ్లీష్ భాష మాట్లాడే వ్యక్తి... ఉండియుంటే అపొస్తలులు మాట్లాడిన ఆ మాటలు వీరికి వారి వారి స్వభాష లో వినిపించియుండేవి. భాష అంటేనే భావాన్ని ప్రసారం చేసేదని, భాషలతో మాట్లాడటం అంటే ఎవరి మాతృ భాషలో వారికి వినిపించుట అని. అంతేకాని అర్ధము లేని పిచ్చి మాటలు పలుకుట కాదు. పరిశుద్దాత్మ వాయిద్యాలు నప్పుడు వస్తుంది అని అంటారు కొందరు. ఇక్కడ వాయిద్యాలు వాయించినది లేదు, అరుపులు, కేకలు వేయుట లేదు(గమనించగలరు). అపోస్తలుల ద్వారా మాత్రమే సూచక క్రియలు, మహత్కార్యములు జరిగినవి(అపో.కా 2:43,5:12). వారు బయలుదేరి వాక్య మంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడైయుండి, వెనువెంట జరుగుచువచ్చిన(మూలభాషలో-వెంబడించుచుండిన) సూచక క్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను.(మార్కు 16 :18) మరియు “..... ప్రభువు వారిచేత సూచకక్రియలను అద్భుతములను చేయించి, తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను”(అపో.కా 14:3). వీటి ముఖ్య ఉద్దేశము అపొస్తలులు తెలియజేసిన సందేశము దేవుని వద్దనుండి వచ్చినదని దృఢపరచటము. ఎందుకంటే అప్పటికి క్రొత్త నిబంధన లేఖనాలు వ్రాయబడుట పూర్తి కాలేదు. అపోస్తలుల చే చెప్పబడిన సందేశము నిజమా? కాదా? అని తెలుసుకొనుటకు.

బైబిల్లో ధాఖలు చేయబడిన  రెండవ సంఘటన: అపోస్తలుడైన పేతురు, కొర్నేలి ఇంటిలో వాక్యము బోధించు చున్నప్పుడు కొర్నేలి ఇంటిలో ఎందరు కూడి వాక్యము వినుచున్నారో వారందరి పైకి పరిశుద్ధాత్మ పంపబడినట్లుగా చూడగలము(అపో.కా 10:44-46). అప్పుడు వారు భాషలతో మాట్లాడుచూ దేవుని ఘనపరచుచుండగా పేతురుతో కూడ వచ్చిన సున్నతిపొందిన విశ్వాసులు విని విభ్రాంతి నొందిరి. ఇక్కడ వీరు అర్ధము లేని మాటలు పలుక లేదు. వారు పలికిన ప్రతి మాట ఏమిటో విన్నవారికి అర్ధము అయినది. కనుకనే వారు దేవుని ఘనపరచు చున్నారని తెలుసుకొని విభ్రాంతి నొందిరి. వాక్యము వినుచున్న ప్రజలు అప్పటికి అసలు బాప్తిస్మము కూడా పొందలేదు. ఈ సంఘటన తరువాతే వారు బాప్తిస్మము పొందవలెనని అజ్ఞాపింపబడి బాప్తిస్మము పొందిరి.  ఇక్కడ కూడా వాయిద్యాలు వాయించలేదు (గమనించగలరు). పరిశుద్దాత్మ వాయిద్యాలు వాయిస్తే వచ్చి పోయే వ్యక్తి కాదు.
 పరిశుద్ధాత్మ ను అన్యజనులకు అనుగ్రహించుట ద్వారా దేవుడు క్రీస్తు యేసు నందు యూదులు మరియు అన్యజనులు వేరు వేరు కాదని ఇద్దరూ సమానమని తెలియజేసాడు(అపో.కా 11:15-17).
ఈ రెండు సంఘటనలలో తప్ప మరి ఇంకెక్కడను దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరింపుగా ఇచ్చినట్లుగా లేఖనాలు తెలియజేయుట లేదు. ఈ రెండు సంఘటనల తరువాత, లేఖనాలను మనం గమనించినట్లయితే కృపా వరములను గురించి చూడగలము. కృపా వరములు నానావిధములుగా వున్నవి గాని ఆత్మ ఒక్కడే(1 కొరింథీ 12:4), వాటిలో కొన్ని ప్రవచన వరము, స్వస్థపరచు వరము, అద్భుత కార్యములు చేయు శక్తి, నానావిధ భాషలు, మరియొకనికి భాషల అర్ధము చెప్పు శక్తియు... వీటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి పంచి ఇచ్చుచు కార్యసిద్దికలుగజేయుచున్నాడు. అపోస్తలులు ఇతరులపై చేతులుంచుట ద్వారా మాత్రమే పరిశుద్ధాత్మ ఇతరులకు అనుగ్రహింపబడినట్లుగా చూడగలము (అపో.కా 8:17-18). అపోస్తలులు ఇతరులపై చేతులుంచుట ద్వారా వారికి ఈ పరిశుద్దాత్మ వరములలో ఒకటి లేదా కొన్ని వరములు వచ్చినట్లుగా చూడగలము. ఆనాడు అపొస్తలులు ఏడుగురిపై చేతులుంచి నట్లుగా చూడగలము(అపో.కా 6:5-6). మహత్కార్యములును, గొప్ప సూచక క్రియలు చేసిన స్తెఫను(అపో.కా 6:8) మరియు ఫిలిప్పు (అపో.కా 8:6), అపొస్తలులచే చేతులుంచబడిన ఈ ఏడుగురిలోని వారే. వీరికి పరిశుద్ధాత్మ కుమ్మరించ బడలేదు, కేవలము అపొస్తలులు చేతులుంచుట ద్వారా మాత్రమే పరిశుద్దాత్మ వరములలో కొన్ని పొందిరి. ఇక్కడ కూడా ఉన్న ఉద్దేశ్యము గమనిస్తే అపొస్తలులు అన్ని ప్రాంతాలకు వెళ్లటం, అన్ని ప్రదేశాలలో ఉండుట సాధ్యము కాదు. గనుక సువార్త ఇతర ప్రాంతాలలో ప్రకటింపబడి జనులు ఆ వాక్యమును నమ్మునట్లు వాక్యము చెప్పే వారిపై అపొస్తలులు చేతులుంచుట ద్వారా వారికి కృపావరములలో ఒకటి లేదా కొన్ని వరములు ఇవ్వబడినవి.

అపోస్తలుడైన పౌలు ఎఫెసులోని బాప్తీస్మము పొందిన వారి మీద చేతులుంచగా వారి మీదికి పరిశుద్ధాత్మ వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును, ప్రవచించుటకును మొదలు పెట్టిరి(అపో.కా 19:6). ఇక్కడ పౌలు చేతులుంచుట ద్వారా వారికి భాషలతో మాట్లాడు వరము, ప్రవచన వరము వచ్చినట్లుగా చూడగలము. తిమోతికి ఇవ్వబడిన కృపా వరము, అపోస్తలుడైన పౌలు తిమోతి పై చేతులుంచుట ద్వారా మాత్రమే వచ్చినది(2 తిమోతి 1:6). అపోస్తలుడైన పౌలు రోమా లోని క్రైస్తవులకు ఆత్మ సంబంధమైన కృపా వరమేదైనను ఇచ్చుటకు వారిని చూడవలెనని అపేక్షిస్తున్నట్లుగా చూడగలము(రోమా 1:12). ఆనాడు ఎవరికైనా కృపావరము ఇవ్వాలంటే అపోస్తలులు వారి దగ్గరికి రావాలి వారి పై చేతులుంచాలి అని లేఖనాల ఆధారంగా గ్రహించగలము.

అపోస్తలులు తప్ప వేరే ఏ వ్యక్తి అయినను మరియు అపొస్తలుల ద్వారా కృపా వరములను పొందియున్నవారు సహితము కూడా కృపా వరములను ఇతరులకు ఇవ్వలేక పోయినారు. సూచక క్రియలు, మహత్కార్యములు చేస్తున్న ఫిలిప్పు సమరయలో ఉన్నా గాని యెరుషలేము నుండి పేతురు యోహాను సమరయ కు వచ్చి వారికి పరిశుద్ధాత్మ ద్వారా కృపా వరములను ఇచ్చుటకు వారిపై చేతులుంచిరి(అపో.కా 8:17-18).

పై లేఖనాల అధారంగా దేవుడు రెండు సంఘటనలలో మాత్రమే పరిశుద్ధాత్మను కుమ్మరింపుగా ఇచ్చినట్లుగా తెలుసుకొన గలము. తర్వాత అపోస్తలులు చేతులుంచుట ద్వారా మాత్రమే ఇతరులకు ఒకటి లేదా కొన్ని కృపావరములు ఇవ్వబడినట్లుగా గ్రహించగలము. మరి ఆ పదమూడు మంది(12 మంది అపోస్తలలు మరియ అపోస్తలుడైన పౌలు) అపోస్తలులు లేరు ఎప్పుడో చనిపొయినారుగదా! అనగా ఆ చక్రము ఆగి పోయినట్లే. ఈనాడు భాషలతో మాట్లాడుచున్నాము అనే వారు ఈ వరాలను ఎలా పొందుచున్నామని చెప్పుచున్నారు? లేఖనాల ప్రకారము చూస్తే వీరు చెప్పేది అబద్ధము. ఈనాడు వీరు ఏమని చెప్పుచున్నారంటే వాయిద్యాలు వాయించినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిందని అప్పుడు భాషలు మాట్లాడు చున్నామని చెప్పుదురు. అసలు పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చిందో చూద్దాము. పేతురు “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు” (అపో.కా 2: 38). అనగా ఒక వ్యక్తి బాప్తిస్మము పొందిన తరువాత పరిశుద్ధాత్మ ఇవ్వబడుచున్నది. అంతే గాని కొన్నాళ్ళు నీతిగా జీవించిన తరువాత కాదు. పేతురు ఈ విధముగా చెప్పెను, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులను సాక్షులమై యున్నాము. లేఖనాను సారముగా బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుదురు. అంతేగాని పాస్టర్ అని చెప్పుకునే వాళ్లు మరియు మేము నీతిగా జీవుస్తున్నాము అని చెప్పుకునే వారు మాత్రమే కాదు. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఇయ్యబడుచున్నది(ఎఫెస్సీ 1:10). బాప్తిస్మము పొందిన తరువాత మనము దేవుని కుమారులుగా స్వీకరించబడుచున్నాము. మనలను దేవుడు కొన్నట్లు అనటానికి గురుతుగా బయనా(అడ్వాన్స్)గా మరియు మనము ఆయన వారు అనుటకు ముద్రగా పరిశుద్ధాత్మ ఇవ్వబడుచున్నది. ఉదాహరణకు:- మనము ఒక స్థలము లేక పొలము లేక ఇల్లు, లేక వస్తువులను కొన్నప్పుడు అది  మన పేర రిజిస్ట్రేషన్ అయ్యే లోపు అది మనది అని ధ్రువ పరచుటకు అడ్వాన్స్ గా లేక బయనాగా కొంత డబ్బులిస్తాము. ఎందుకంటే అది మనది, దానిని తప్పకుండా మనము తీసుకుంటామని భరోసాగా అది ఉంటుంది. అలాగే దేవుడు బాప్తిస్మము పొందిన వ్యక్తిని తన దత్త కుమారునిగా స్వీకరించుచున్నాడు. రేపు తనతో కూడా పరలోకంలో ఉండుటకు తీసుకుని వెళ్తానని సంచకరువుగా(బయానాగా) పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఒకసారి ఇచ్చిన బయానా(అడ్వాన్స్)ను వెనక్కి తీసుకుంటే అది కొన్నవ్యక్తిది ఆవుతుందా? ఒక్కసారి ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు మనలో నివాసిస్తున్నాడు. “మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మ కు ఆలయమై యున్నదని మీరెరుగరా” అందుకనే దేవుడు ఇచ్చిన పరిశుద్దాత్మకు మనదేహము ఆలయమై యున్నది(1కొరింథీ 3:16,6:19-20), ఎఫేస్సి పత్రిక లో ఈ విధముగా చెప్పబడి యున్నది”దేవుని పరిశుద్ధాత్మ ను దుఃఖ పరచకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి యున్నారు” (ఎఫెసి 4:30). మనము ఈ దేహమునుండి విమోచింపబడే దినము వరకు పరిశుద్దాత్మ యందు మనము ముద్రింపబడి యున్నాము. యాకోబు పత్రిక లో ఈ విధముగా చెప్పబడి యున్నది. “ఆయన మనలో నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా ఆపేక్షించునా.”..(యాకోబు 4:5). 2వ తిమోతి పత్రిక లో ఈ విధముగా చెప్పబడి యున్నది. “...నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్ధమును మనలో నివసించు  పరిశుద్ధాత్మ వలన కాపాడుము” (2 వ తిమోతి 1: 14) పై లేఖనాలను గమనించుట ద్వారా  దేవుని చే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కి బాప్తిస్మము  పొందిన వెంటనే ఇవ్వబడి ఆ వ్యక్తి ఈ దేహము నుండి విమోచింపబడే వరకు  అతనిలో ఉంటున్నట్లుగా గ్రహించగలము. అంతేకాని వాయిద్యాలు వాయిస్తే వచ్చిపోయేది కాదు పరిశుద్ధాత్మ. ఎవరైతే పరిశుద్ధాత్మను వాయిద్యాలు వాయించుట ద్వారా పొందుచున్నామని చెప్పుదురో వారు చెప్పేది నిజమైతే  అపోస్తాలులైన పేతురు మరియు పౌలు ఎలా అయితే చనిపోయిన వారిని బ్రతికించారో(అపొ.కా 9:36-41; 20:8-12) అదే విధముగా చనిపోయిన వారిని లేపాలి అనగా వారిని బ్రతికించాలి. పాములు వారిని కాటు వేసినను వారికీ ఏ హాని కలుగ కూడదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలుకు మెలితే ద్వీపములో పాము కరచినను అతనికి ఏ హాని కలుగలేదు(అపొ.కా 28:3-6) ఇలా ఏ మానవుడు చేయలేడు. ఎవరైతే వాయిద్యాలు వాయించినప్పుడు పరిశుద్ధాత్మ వస్తుందని భాషలు మాట్లాడుచున్నామని చెప్పుదురో వారు పుర్తిగా అబద్ధమును చెప్పుచు జనులను మోసము చేయుచున్నారని గ్రహింపగలము. ఎందుకంటే వాయిద్యాలు ఆపివేయగానే పరిశుద్దాత్మ పోయినది అని తెలియజేయుచున్నారు. కాబట్టి దేవుడు ఇతను నా వాడు అనటకు బయనాగా లేక అడ్వాన్స్ గా ఇచ్చిన పరిశుద్ధాత్మను వెనుకకు తీసుకున్నాడు అని వీరే తెలియజేయుచున్నారు, మరియు మేము దేవునికి చెందిన ప్రజలము కాదు అని వారే స్పష్టముగా చెప్పుచున్నారు. కనుక పరిశుద్ధాత్మ వాయిద్యాలు వాయించ గానే వచ్చింది భాషలు మాట్లాడుచున్నామని చెప్పే వారిని నమ్మి మోసపోవద్దు. అలా నమ్ముట ద్వారా దేవునిచే ఇవ్వబడే నిత్యజీవమును పోగొట్టుకొనవద్దు.

క్రీస్తు నందు మీ సహోదరులు
వి. అశోక్, వి. కిరణ్
క్రీస్తు సంఘం – మున్నంగి, కొల్లూరు

Comments

  1. Good message exlent wonderful more than send me WhatsApp 👉 wa.me/+919652152009.

    ReplyDelete

Post a Comment