స్వస్థత వరము మాకు ఉన్నదని చెప్పుచున్న అబద్ధ బోధకులను గురించి.

స్వస్థత వరము మాకు ఉన్నదని చెప్పుచున్న అబద్ధ బోధకులను గురించి.
(False Preachers – Claiming As Having Healing Power)

ప్రియ చదువరి! ఈనాడు కొంత మంది మాకు స్వస్థత వరము ఉంది, రోగాలను పోగొట్టగలము అని అంటున్నారు, రోగులపై చేతులుంచి ప్రార్ధించుట ద్వారా వారికి స్వస్థత చేకుర్చగలము అని అంటున్నారు. కొంత మంది మేము ప్రార్ధించి ఇచ్చే కొబ్బరి నూనెను లేక తైలమును మీరు త్రాగినచో లేక శరీరములో బాధ కలిగిన ప్రదేశములో వ్రాసినచో మీ బాధలు తగ్గును అని అంటున్నారు, ఇంకొంతమంది మేము కొరకు ప్రార్ధించే సమయములో మీపై చేతులను ఉంచుట ద్వారా మీరు స్వస్థత పొందుదురని ఇలా రక రకాలుగా చెబుతున్నారు. మరి కొందరు స్టేజి మీద రోగులను పిలిచి వారిని గూర్చి ప్రార్ధించి వారు స్వస్థత పొందినట్లు కల్పితముగా చూపుతున్నారు, వీరు చేసే విషయము బైబిల్ గురించినది, కనుక దీనిని లేఖనాననుసారముగా పరిశీలిద్దాము.
     ఆనాడు యేసు క్రీస్తు వారు శరీరధారియైయున్న దినములలోను ఆయన శిష్యులు జీవించియున్న కాలములోను అనేక మంది రోగులను స్వస్థ పరచబడినారు, ఆ స్వస్థతలు ఎలా జరిగినవో చూద్దాము.

ఆయన(క్రీస్తు)లో ప్రభావము ఉండెను: పేతురు అత్త జ్వరముతో ఉన్నప్పుడు యేసు క్రీస్తు వారు ఆమె చెయ్యి పట్టుకుని జ్వరమును గద్దింపగానే జ్వరము ఆమెను విడిచెను. అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను(మార్కు 1:30-31; మత్తయి 8: 14-15). ఒక కుష్ట రోగి ఆయన యొద్దకు వచ్చి నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అప్పుడు ఆయన కుష్టు రోగము గలవానిని చెయ్యి పట్టు కొని నాకిష్టమే నీవు శుద్ధుడవుకమ్మనగానే వెంటనే కుష్ట రోగము వానిని విడచెను(మార్కు 1:40-42). అదేవిధంగా నానా విధ రోగాములచే పీడింపబడుచున్న వారినందరినీ క్రీస్తు యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన వారిపై చేతులుంచి వారిని స్వస్థ పరచెను(లూకా 4:40). ఆయనలో నుండి ప్రభావము బయలుదేరి అందరిని స్వస్థ పరచు చుండెను(లూకా 6:19). ఒకనాడు పండ్రెండుయేండ్ల నుండి రక్త స్రావము గల స్త్రీ యేసు క్రీస్తు వారిని ముట్టుకుంటే స్వస్థపడుదుననుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొనెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలచెను(మార్కు 5:25-29). అదేవిధముగా అనేక మంది రోగులు ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టనిమ్మని వేడుకొనిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి(మార్కు 6:56). ఆయనకు స్వస్థ పరచే శక్తి ఉంది కనుకనే ఇతరులు ఆయనను ముట్టుకొన్నా, ఆయన ఇతరులపై చేతులుంచినా మానవులకు ఉన్న రోగములను, బాధలను పోగొట్టగలిగినాడు.

ఆయన(క్రీస్తు) మాటలో జీవము ఉన్నది: పక్షవాయువుగల వానిని చూసి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మనగానే తక్షణమే వాడు లేచి తన పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయెను(మార్కు 2:11-12). ఒక నాడు కపెర్నహూము పట్టణములోని ప్రధాని తన కుమారుడు చావక మునుపే తన ఇంటికి రమ్మని ఆయనను వేడుకొనగా, నీ కుమారుడు బ్రతికే యున్నాడని యేసు క్రీస్తువారు చెప్పగా ఆ క్షణములోనే ఆ బిడ్డను జ్వరము విడచెను(యోహాను 4:49-54). ఒక నాడు సమాజ మందిరములో ఊచచెయ్యి గల వానిని యేసు క్రీస్తు చూసి నీ చెయ్యి చాపు మనగానే వాని చెయ్యి బాగు పడెను(లూకా 6:6,10). పక్షవాయువుతో బాధపడుచున్న శతాధిపతి దాసుని యేసు క్రీస్తు వారు తన మాటతోనే వానికి స్వస్థత అనుగ్రహించెను(మత్తయి 8:5,6,13).

యేసు క్రీస్తు వారు తన పండెడ్రు మంది శిష్యులకు ఈ అధికారము ఇచ్చెను: ఆయన శిష్యులను ఇశ్రాయేలులోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళమని చెప్పెను, వారిలోని రోగులను స్వస్థ పరచుడి అని చెప్పెను. కాబట్టి వారు ఆలాగుననే వెళ్లి రోగులను స్వస్థ పరచుచు నుండిరి(మత్తయి 10:1,8;మార్కు 6:13). యేసు క్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తరువాత తన శిష్యులకు సర్వ లోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుమని చెప్పెను. వారికి పరిశుద్ధాత్మను పంపుదునని వాగ్ధానము చేసెను. పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురని చెప్పెను. పెంతెకోస్తు పండుగ నాడు వారికి పరిశుద్దాత్మ అనుగ్రహింప బడినది, అప్పుడు వారు శక్తి నొందిరి(అపొ.కా 2:1-5). అపోస్తలుడైన పేతురు, యోహానును యేరుషలేములోని దేవాలయమునకు వెళ్ళుచుండగా ఆ దేవాలయము యొక్క శృంగారమనే ద్వారమునొద్ద భిక్ష మడుగుటకు కూర్చున్న పుట్టిన దగ్గర నుండి కుంటివాడైన వానిని పేతురు, “నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని” చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనేత్తెను. వెంటనే వాని పాదములును, చీల మండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచేను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయమునకు వెళ్ళెను(అపొ.కా 3:6-8;4:22). ఆ స్వస్థత నొందిన వానికి 40 సంవత్సరముల వయస్సు ఉంది. పేతురు వచ్చు చుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీద నైనను అతని నీడయైనను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను ఉంచిరి, వారందరునూ స్వస్థత నొందిరి(అపొ.కా 5:12,15-16). లుద్ద ప్రాంతములో కాపురమున్న ఐనెయ అనే వ్యక్తి ఎనిమిది సంవత్సరముల నుండి పక్షవాయువుతో మంచము పట్టి యున్నాడు, పేతురు వానిని చూసి “ఐనెయ యేసు క్రీస్తు నిన్ను స్వస్థ పరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని” అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను(అపొ.కా 9:33-35). పేతురు ఆనాడు యొప్పే ప్రాంతములో ఉన్న తాబిత అనే శిష్యురాలు చనిపోయి నప్పుడు ఆమెను బ్రతికించినట్లుగా కూడా చూడగలము. బైబిల్లో జరిగిన స్వస్థతలు వెనువెంటనే జరిగినవి, వాటికి వారములు, నెలలు సమయము పట్టలేదు.

     అదే విధముగా దేవుడు అపోస్తలుడైన పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. పౌలు శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లు అయినను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దయ్యములు కూడా వదలి పోయెను(అపొ.కా 19:11-12). పౌలు వారి యొద్దకు రానవసరము లేకుండానే వారిని గురించి ప్రార్ధించ నవసరము లేకుండానే దేవుడు వారిని పౌలు నడికట్లు, చేతిగుడ్దల ద్వారా స్వస్థపరిచాడు. పౌలు మేలితే ద్వీపములో పొప్లి అనే వాని యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేదిచేతను బాధపడుచు పండుకొని యున్నప్పుడు పౌలు అతని యొద్దకు వెళ్లి ప్రార్ధన చేసి, అతని మీద చేతులుంచి స్వస్థ పరచెను. ఆ ద్వీపములోని అనేకులు కూడా వచ్చి స్వస్థత పొందిరి(అపొ.కా 28:8,9). పౌలు చనిపోయిన ఐతుకు అను నొక యౌవ్వనస్థుని కూడా లేపినట్లుగా చూడగలము(అపొ.కా 20:9-10). దేవుడు ఆనాడు అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని అనుగ్రహించెను. కాబట్టి వారు కృపావరములను కలిగి యుండిరి. అపోస్తలులు చేతులుంచుట ద్వారా మాత్రమే ఒకడు కృపా వరములలో ఒకటి లేదా కొన్ని కృపావరములను పొందిరి. ఈనాడు అపోస్తలులు లేరు ఎప్పుడో చనిపొయినారు. కనుక ఈ కృపావరములను పొందే అవకాశము లేనే లేదు. దేవుడు ఈ కృపా వరములను ఇచ్చిన ఉద్దేశము అపోస్తలులచే చెప్పబడిన “సందేశము(సువార్త)” దేవుని యొద్ద నుండి వచ్చినదని ధృడ పరచుటకు(మార్కు 16:20). క్రొత్త నిబంధన లేఖనాలు వ్రాయబడుట పూర్తి అగుచున్నప్పుడే ఈ స్వస్థత వరములు ఆగిపోవుట ప్రారంభము అయినది. ఎందుకంటే పౌలు తోటి పనివాడైన త్రోఫీము రోగియై నప్పుడు అతనిని మిలేతులో విడిచి వచ్చెను(2 వ తిమోతి 4:20). తిమోతిని కూడా పౌలు అతనికి వచ్చే కడుపు జబ్బు నిమిత్తము అతనిని ద్రాక్షా రసము కొంచెము పుచ్చు కొనుమని చెప్పెను(1 వ తిమోతి 5:23). దేవుడు అప్పుడే స్వస్థతను గూర్చిశాశ్వతమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసెను. మీలో ఎవడైనా  రోగియైన యెడల అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె వ్రాసి అతని కొరకు ప్రార్ధన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్ధన ఆరోగిని స్వస్థ పరచును. ప్రభువు అతని లేపును(యాకోబు 5:14-15). మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్ధన చేయుడి, ఇది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ.
   
     ఈనాడు ఒకడు నాకు స్వస్థత వరము ఉంది అంటే అతడు అబద్దము చెప్పుచున్నట్లే, అలా చెప్పుకొనే వాడు ఎటువంటి రోగినైనను స్వస్థపరచ వలెను, షుగర్ వ్యాధిగ్రస్తుల నైనను, జ్వరముతోనున్న వారినైనను, కిడ్నీలు పనిచేయని వారినైనను ఇలా ఎటువంటి వ్యాధి గల వారినైనను అతడు వెను వెంటనే స్వస్థ పరచవలెను. అలా చెయ్యలేనప్పుడు వాడు అబద్ధమును చెబుతున్నాడని మనము గ్రహించాలి. ఇలా మాకు స్వస్థత వరము ఉంది అని చెప్పిన అనేక మంది అబద్ధికులు చనిపోయేటప్పుడు షుగర్ వ్యాధితోనో లేక ఇతర వ్యాధులతోనో చనిపోయినట్లుగా చూసినాము. ఈనాడు చాలా మంది ప్రార్ధన చేయునప్పుడు ఇతరులపై తమ చేతులుంచి ప్రార్ధించుదురు. వీరిలో ఏమైనా ప్రభావము ఉన్నదా? ప్రభావము వెళ్లి వారిని స్వస్థ పరచుటకు యేసు క్రీస్తు వారిలో ప్రభావము ఉంది కనుక ఆయన రోగులపై చేతులు వారిపై వుంచి ప్రార్ధించి నాడు. ఇలాంటి వారిని నమ్మవద్దు. ఇలాంటి వారిని  మీరు కేవలం “ఎన్నుకున్న” కొందరిని మాత్రమే ఎందుకు స్వస్థ పరుస్తున్నారు? అందరికీ ఎందుకు స్వస్థత కలుగ చేయలేక పోచున్నారు అని ప్రశ్నిస్తే “వారిలో తగినంతగా విశ్వాసము లేదని” చెప్పుదురు. కానీ బైబిల్ లో స్వస్థత పొందిన అనేకులలు విశ్వాసము లేకుండగానే స్వస్థత నొందిరి. వీరికి అసలు స్వస్థత వరము లేదు కనుకనే ఇతరులను స్వస్థ పరచలేకపోవుచున్నారు. అందుకనే కపటముగా “ఒక వారము, లేక నెల మావద్ద ప్రార్ధనకు రండి అప్పుడు మీకు స్వస్థత చేకూరును” అని చెప్పుచుందురు. కాబట్టి స్వస్థత వరము ఉన్న దైవజనులు సభల అనంతరము మీకోరకు ప్రార్ధించెదరు, కనుక సభలకు రండి అని చెప్పే వారిని నమ్మ వద్దు, అలా నమ్మి నీ ధనమును సమయనుము వృధా చేసుకొనవద్దు. ఎందుకంటే స్వస్థత వరముగల దైవజనులు(అపోస్తలులు మరియు వారి నుండి కృపావారములు పొందినవారు) ఎప్పుడో మరణించిరి!

     క్రీస్తును విశ్వసించే నీవు ఎప్పుడైనను రోగివై యైనప్పుడు దేవుడు చెప్పిన రీతిగా సంఘపు పెద్దలను పిలిపించుకుని వారిచే నూనె వ్రాయించుకొని వారిచే ప్రార్ధన చేయించుకో. ఈ లేఖనము ప్రకారము నూనె వ్రాసే అధికారము పెద్దకే ఉన్నట్లు చూడగలము. స్వస్థ పరచేది దేవుడే, మనుష్యుడు కాదు, ఎందుకంటే అది ఆయన లక్షణాలలో ఒకటి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన చెప్పెను.(నిర్గమ 15:26).

క్రీస్తు నందు మీ సహోదరులు
వి. అశోక్, వి. కిరణ్
క్రీస్తు సంఘము – మున్నంగి, కొల్లూరు

Comments