చనిపోయిన వారు దయ్యముగా మరతారా? లేక దయ్యములు ప్రత్యేక జీవులా?

చనిపోయిన వారు దయ్యముగా మరతారా? లేక దయ్యములు ప్రత్యేక జీవులా?

ప్రియ చదువరి! ఈనాడు కొంతమంది చనిపోయిన వారు దయ్యములుగా మారి ఇతరులను ఆవహిస్తున్నట్లుగా లేక పట్టి పీడిస్తున్నట్లుగా చెప్పుచున్నారు. కొందరికి దయ్యములు పట్టినట్లుగా చెప్పుచున్నారు. ఇటువంటి వారిని స్వస్థత కొరకు చనిపోయిన భక్తుల సమాధుల దగ్గరికి తీసుకుని వెళ్ళుచున్నారు. ఇంకొందరు భూత వైద్యుల దగ్గరకు తీసుకొని వెళ్లుచున్నారు. ఇటువంటి వారికి మేము స్వస్థత చేకూరుస్తాము అని కొందరు చెప్పుకొనుచున్నారు, కొందరు అబద్ధ బోధకులైతే స్టేజి మీద దెయ్యములు పట్టిన వారికి స్వస్థత చేకూరుస్తున్నట్లు చూపిస్తున్నారు. అయితే క్రీస్తును నమ్మే నీవు మోసపోకుండా ఉండుటకై వీటిలో నిజమెంతో తెసుకోవడం ఎంతో అవసరం. అసలు చనిపోయిన వారు దయ్యముగా మారతారా? లేదా? అపవిత్రాత్మలు అంటే ఏమిటి? అనే విషయము గురించి పరిశుద్ధ గ్రంథము ఏమి చెప్పుచున్నదో తెలుసుకుందాము.

అసలు చనిపోయిన వారు దయ్యముగా మారతారా?

            మానవుని నిర్మాణము గురించి బైబిలు ఈ విధముగా చెప్పుచున్నది. “దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. - ఆది.కా 2:7”. అనగా దేవుడు ఈ నేల నుండి మట్టిని తీసి ఆ మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రాలలో జీవ వాయువును ఊదినాడు, తద్వారా మానవుడు జీవుంచు ప్రాణి ఆయెను మరియు దేవుని స్వరూపమైన ఆత్మ కూడా మానవునికి ఇవ్వబడింది. దేవుడు తన మాటతోనే జంతువులనూ సృష్టించినాడు. జంతువులకు శరీరము, ప్రాణము మాత్రమే ఉన్నవి, కానీ మానవులలో మాత్రమే శరీరము, ప్రాణము మరియు దేవుని స్వరూపమైన ఆత్మ వున్నవి. మనిషి చనిపోయినప్పుడు అనగా ప్రాణము పోయినప్పుడు మంటితో నిర్మించబడిన ఈ శరీరము మరల కుళ్ళి పోవటము ప్రారంభమగును. కాబట్టి ఆ దేహమును మనము పాతిపెట్టినా లేక కాల్చినా అది మట్టిలో కలిసి పోతుంది, మనలో ఉన్న ఆత్మ దానిని దయచేసిన దేవుని కాపుదలకు వెళుతుంది. అంతేగాని చనిపోయిన వాని ఆత్మ ఇక్కడ తిరుగదు. “మన్నయినది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.” - ప్రసంగి 12: 7

            చనిపోయిన వారు ఎవరిని ప్రేమించలేరు, ఎవరిపై పగపెట్టుకొనలేరు, పగసాధించలేరు. ఈ భూమిపై జరిగే కార్యములలో వారికి అసలు భాగమే లేదు. ఎందుకంటే వారి శరీరము మట్టిగా మారి ఉనికిని కోల్పోయింది. వారి ఆత్మ దేవుని కాపుదలలో ఉంది. కాబట్టి వారు ఈ భూమి పైకి తిరిగి రాలేరు, ఉనికి కలిగివుండలేరు. ఎటువంటి పరిస్థితులలో వారికి భూమిపై జరిగే ఏ క్రియలలో పాల్గొనే అవకాశమ వారికి లేదు. ఎందుకంటే లేఖనము ఈ క్రింది విధముగా చెప్పుచున్నది. “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారి పేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.” - ప్రసంగి 9: 5-6. కనుక చనిపోయిన వ్యక్తి దయ్యముగా మారి వేరొకరికి అవహించుట అనేది అసలు జరుగదు. ఎవరైనా నాకు చనిపోయిన ఫలానా వ్యక్తి ఆవహించాడని చెపితే అతను అబద్ధమును చెప్పుచున్నాడని గ్రహించండి.

అపవిత్రాత్మ లేక దయ్యముల ఉనికి:

          అపవిత్రాత్మ(గ్రీకులో pneuma akatharto) లేక దయ్యము(గ్రీకులో daimonion) అనేవి ప్రత్యేక ఉనికి కలిగివున్న మానవాతీత జీవులు, ఇవి సాతాను సంబంధులు. “ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాధులతోను, ఆకాశామండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.” - ఎఫెసి 6 : 12. ఈనాడు దయ్యమును వదలగొడతాననే వ్యక్తి దయ్యముచే పీడింపబడుచున్నాననే వ్యక్తిని కొట్టటం లేక పడద్రోయుట చేస్తున్నారు. కానీ యేసు క్రీస్తు వారు అపవిత్రాత్మలను లేక దయ్యములను వదలగొట్టటానికి ఏ వ్యక్తిని కూడా అలా చేసినట్లు లేదు, “ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి, రోగుల నెల్లను స్వస్థపరచెను.” - మత్తయి 8: 17; “ఆయన దయ్యములను వెల్లగొట్టు చుండెను.” - మార్కు 1:39. ఒకసారి సురో ఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసుదేశస్థురాలు ఆయన యొద్దకు వచ్చి నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఆ సమయములో ఆమె కుమార్తె ఇంటి వద్దనే ఉండెను. కొంతసేపటి తరువాత ఆయన దయ్యము నీకుమార్తెను వదలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తెలో నుండి దయ్యము వదలి పోయెను(మార్కు 7:26-30). “అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన యెదుట సాగిలపడి - నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలువేసిరి.” - మార్కు 3: 11. దయ్యములు తన్ను ఎరిగియుండినందున ఆయన వాటిని మాటలాడనివ్వలేదు(మార్కు1:34). గెరాసేనులదేశములో దయ్యముపట్టినవాడు దూరము నుండి యేసుని చూసి పరుగెత్తికొనివచ్చి, ఆయనకు నమస్కారముచేసి యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను.(మార్కు 5: 6-7). అక్కడ పందుల పెద్ద మంద మేయుచుండెను. వాటిలోనికి ప్రవేశించునట్లు మమ్మును వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. ఆయన సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను.(మార్కు 5:11-12). దయ్యము ఒకనిని ఆవహించినప్పుడు ఆ వ్యక్తి తన ఎదుట నున్న వ్యక్తిని ఎప్పుడునూ చూడక పోయినను వారు ఎవరో, ఏమిటో అనే సంగతిని కూడా తెలియ చేయుట జరిగినది. ఇది మనము గుర్తించాలి.

           ఈ విధముగా అనేకమందిలోని అపవిత్రాత్మ లేక దయ్యములను యేసు క్రీస్తు వారు వెళ్లగొట్టెను, అలాగే యేసు క్రీస్తు వారు తన శిష్యులకు దయ్యములపై అధికారము ఇచ్చి నట్లుగా క్రింది లేఖనాలు పరిశీలించుట ద్వారా తెలుసుకోగలము; అంతే తప్ప వారు తమ సొంత శక్తిచే దయ్యములను వెళ్ళగొట్టలేదు. యేసు క్రీస్తువారు తన శిష్యులు తనతో కూడ ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు అధికారముగలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పండ్రెండు మందిని నియమించెను(మార్కు 3: 14-15). ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికార మిచ్చెను(మత్తయి 10:1, లూకా 9:1-2); మరియు ఆయన ఈవిధముగా చెప్పెను, “రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.” - మత్తయి 10: 8. కాబట్టి ఆనాడు యేసు క్రీస్తు శిష్యులు దయ్యములను వెళ్ళగొట్టగలిగారు. అపొస్తలులు ఈ అధికారమును పొందిరి, మరియు పెంతెకోస్తను పండుగ దినము నాడు వారు యేసు క్రీస్తు వారిచే వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మను పొందిరి. “అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.” - అపో.కా2:2-4. తద్వారా వారు క్రొత్తభాషలు మాట్లాడిరి, సూచక క్రియలు, అద్భుతములు చేయగలిగిరి. మరియు అనేక మహత్కార్యములును సూచకక్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను.(అపో.కా 2: 43) ప్రజలమధ్య అనేకమైన సూచకక్రియలును మహత్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను.(అపో.కా 5: 12). పేతురు నీడ పడిన అనేకమంది రోగులు స్వస్థత నొందిరి. అపవిత్రాత్మలు కూడా వదలిపోయెను. “అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవని మీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింప బడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి” - అపో.కా 5: 15-16.

           అపొస్తలులు ఎవరిపై చేతులుంచిరో వారికి కృపావరములలో ఒకటి లేదా కొన్ని ఇవ్వబడినవి. అపొస్తలులు ఏడుగురిపై చేతులుంచినట్లుగా చూడగలము.(అపో.కా 6 : 5-6). ఫిలిప్పు ద్వారా కూడా సూచక క్రియలు జరిగించబడెను. ఫిలిప్పు కూడా అపొస్తలులు చే చేతులుంచబడిన వారిలోని వాడే, ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతోలక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలువేసి వారిని వదలిపోయెను; పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి.(అపో.కా 8: 5-7). అపొస్తలుడైన పౌలు కూడా దయ్యములను వెళ్ళగొట్టెను. పుతోను అను దయ్యము పట్టిన ఒక చిన్నది పౌలును, సీలయు ప్రార్ధనా స్థలమునకు వెళ్లుచుండగా వారిని వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై యున్నారని కేకలు వేసి చెప్పెను. ఇలా ఆ బాలిక అనేక దినములు చేయుచున్నప్పుడు పౌలు ఆమె వైపు తిరిగి నీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను; వెంటనే అది ఆమెను వదలిపోయెను.(అపో. కా 16 : 18). పౌలు అపొస్తలుడు కనుకనే ఈ అధికారమును కలిగి యున్నాడు. పౌలు యొక్క నడికట్లయినను, అతని శరీరము నాకు తగిలిన చేతి గుడ్డలైనను దయ్యము లేక అపవిత్రాత్మ పట్టిన వారి వద్దకు తెచ్చినప్పుడు దయ్యములు వారిని వదలిపోయెను. “మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను; అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లయినను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలి పోయెను” - అపో.కా 19: 11-12. అపొస్తలులు మరియు వారు ఎవరిపై చేతులుంచిరో వారు మాత్రమే దయ్యములను వెళ్లగొట్టిరి. కొంత మంది ఇతరులు కూడా దయ్యములను వెల్లగొట్టాలని ప్రయత్నించిరి. అప్పుడు ఏమి జరిగినదో చూడండి.

           "అప్పుడు దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులు-పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి, దయ్యములు పట్టినవారిమీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ఒక ప్రధానయాజకుని కుమారులు ఏడుగురు ఆలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి, వారిమీద పడి, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింటనుండి పారిపోయిరి." - అపో. కా 19: 13-16. ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. కాబట్టి ఒకడు దయ్యములను వెళ్ళగొట్టాలంటే వాటిపై అధికారమును యేసు క్రీస్తు ద్వారా లేక ఆనాటి అపోస్తలులు చేతులుంచుట ద్వారా పొందిన వాడై యుండాలి.

ఈ కాలములో దయ్యములు ఉన్నాయా?

           ఈనాడు దయ్యము పట్టినదని చెప్పేవారు, చనిపోయిన ఫలానా వ్యక్తి(ఉదా: ఎల్లయ్య, పుల్లయ్య, రమణమ్మ, సూరమ్మ...) దయ్యముగా మారి ఇతరులను ఆవహిస్తున్నట్లుగా చెప్పుచున్నారు. ఇలా చెప్పేవారు ఎవరైనా, ఎంతటి వారైనను వారు అబద్ధమునే చెప్పుచున్నారు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి అసలు ఈ భూమి మీద ఉనికి కలిగి యుండలేరు. అతడు లేక ఆమె దేహము కోల్పోయినారు. వారి ఆత్మ దేవుని కాపుదలలో ఉంది. కనుక చనిపోయిన వారు దయ్యముగా మారటం అసంభవము. ముందుగా చెప్పబడినట్లుగా, అపవిత్రాత్మ లేక దయ్యములు అనేవి ప్రత్యేకంగా ఉనికి కలిగివున్న జీవులు. ఈనాడు దయ్యములు లేక అపవిత్రాత్మలు మనుష్యులను ఆవహించుట లేదు. ఆనాడు యేసు క్రీస్తు మరియు ఆయన శిష్యుల కాలములోనే అవి వెళ్లగొట్టబడినవి. ఎందుకంటే క్రీస్తును గూర్చిన ప్రవచనము ఈ విధముగా కలదు. “ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును, యెరూషలేము నివాసుల కొరకును ఊట యొకటి తియ్యబడును. ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు-ఆ దినమున విగ్రహముల పేళ్లు ఇకను జ్ఞాపకము రాకుండ దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును; మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండచేతును.” - జెకర్యా 13: 1-2. కాబట్టి యేసు క్రీస్తు వారు అనేక దయ్యములను వెళ్ళగొట్టెను మరియు తన శిష్యులకు వాటిపైన అధికారమును అనుగ్రహించెను. తద్వారా వారు కుడా దయ్యములను వెళ్ళగొట్టెను. ఒకానొక సందర్భములో ఆయన శిష్యులు వచ్చి దయ్యములు కూడా నీ నామము వలన మాకులోబడుచున్నవని ఆయనతో చెప్పిరి. అప్పుడు యేసు సాతాను మెరుపువాలె ఆకాశము నుండి పడుట చూసితినని చెప్పెను. అనగా సాతానుయొక్క అధికారము తగ్గించబడినదని ఆయన చెప్పెను. పై లేఖనాల ద్వారా ఈనాడు ప్రవక్తలు లేరు మరియు దయ్యములు లేక అపవిత్రాత్మలు కూడా లేనే లేవు. ఇవి క్రీస్తు శకం మొదటి శతాబ్దము లోనే తోలివేయబడినవి. ఎందుకంటే లేఖనాలు నెరవేరునట్లు యేసు క్రీస్తు వారు మరియ ఆయన శిష్యులు వాటినిని వెల్లగొట్టినట్లు చూడగలము. దయచేసి లేఖనాలను విశ్వసించండి, మానవుల భోదను బట్టి గాక, లేఖనాలను పరిశీలించుట ద్వారా విశ్వసించండి.  ఏవరైనా ఈనాడు ఫలానా వ్యక్తికి దయ్యము లేక అపవిత్రాత్మ పట్టినదని చెపితే వాడు అబద్ధమును చెప్పుచున్నాడని పైన పేర్కొనబడిన లేఖనాల ద్వారా గ్రహించండి. ఏవ్యక్తి అయిన ఈనాడు నాకు దయ్యములను వెళ్ళగొట్టే శక్తి వున్నదని చెప్పినా అతడు అబద్ధమును చెప్పుచున్నాడని గ్రహించండి. అటువంటి వారిని నమ్మి మోసపోవద్దు. లేఖనాలను విశ్వసించుట ద్వారా నిత్యజీవమును చేపట్టండి.

సహోదరులు : వి. అశోక్ & వి. కిరణ్

క్రీస్తు సంఘం - మున్నంగి,  కొల్లూరు

Comments